||సుందరకాండ ||

||ఏబది నాలుగవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
వీక్షమాణస్తతో లంకాం కపిః కృత మనోరథః|
వర్థమాన సముత్సాహః కార్యశేషమచింతయత్||1||
స|| తతః కృతమనోరథః కపిః లంకాం వీక్షమాణః వర్ధమాన సముత్సాహః శేషం కార్యం అచింతయత్||
తా|| అప్పుడు హనుమంతుడు తన మనోరథమును సాధించినవాడై లంకానగరమును చూచూ ఉత్సాహము మరింత పెరిగినవాడై మిగిలిన కార్యక్రమము గురించి ఆలోచించెను
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ చతుఃపంచాశస్సర్గః||

అప్పుడు హనుమంతుడు తన మనోరథమును సాధించినవాడై లంకానగరమును చూచూ ఉత్సాహము మరింత పెరిగినవాడై మిగిలిన కార్యక్రమము గురించి ఆలోచించెను.

' ఇప్పుడు ఈ రాక్షసులకు మరింత సంతాపము కలిగించగలిగినది ఏదో అదే నాకు మిగిలిన కర్తవ్యము. వనము ధ్వంసము చేయబడినది. రాక్షసుల కొందరు హతమార్చబడిరి. దేశముయొక్క బలగము నాశనము చేయబడినది. దుర్గవినాశనము మిగిలినది. దుర్గము కూడా నాశనము చేసినచో చేసిన పరిశ్రమ సుఖకరము అగును. ఈ కార్యములో కొంచెము శ్రమ తీసుకున్నచో కార్యము సఫలము అగును. నా లాంగూలములో ప్రజ్వరిల్లుతున్న అగ్నిదేవునకు ఈ ఉత్తమమైన గృహములతో సంతర్పణ చేయుట న్యాయము.'

అప్పుడు ప్రజ్వరిల్లితున్న లాంగూలము కల మహాకపి, మేఘములలో మెరుపులవలె ఆ భనాగ్రములలో సంచరించ సాగెను. ఆ వానరుడు ఉద్యానములను ప్రాసాదములను చూచి భయము లేకుండా ఒక భవనము నుండి ఇంకొక భవనమునకు సంచరించెను.

వేగములో వాయువుతో సమానమైన మహావేగము కల వానరుడు ప్రహస్తుని గృహముపైకి ఎగిరి, అక్కడ నిప్పు అంటించి అక్కడనుంచి మహాపార్శ్వుని గృహముపైకి ఎగిరి, అక్కడ కాలాగ్నితో సమానమైన అగ్నిని రగిలించెను.

ఆ మహాతేజము కల మహాకపి అప్పుడు వజ్రదంష్ట్రుడు, ధీరుడైన శుకుడు, సారణుని గృహముల పైకి దూకి అచట కూడా అగ్ని రగిలించెను. ఆ వానర యూధపుడు అప్పుడు ఇంద్రజిత్తుని భవనము దహించెను. పిమ్మట జంబుమాలి , సుమాలి భవనములను దహించెను. పిమ్మట రస్మికేతుని భవనము అలాగే రాక్షసులు అగు సూర్యశత్రువు , హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశస్యుల గృహములను దహించెను. అలాగే రాక్షసులు యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు అలాగే హస్తిముఖుల భవనములను దహించెను.

అలాగే కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుల గృహములను దహించెను. కుంభకర్ణుని భవనము మకరాక్షుని భవనము దహించెను. యజ్ఞశత్రుని భవనము, బ్రహ్మశత్రుని భవనము, నరాన్తకుడు కుంభుడు , దురాత్ముడు నికుంభుని భవనము దహించెను. మహాతేజోవంతుడగు విభీషణుని భవనము మాత్రము వదిలేసి క్రమముగా మిగిలిన భవనములను క్రమము తప్పకుండా ఆ హరిపుంగవుడు దహించెను.

మహాయశోవంతుడైన ఆ మహాకపి ఐశ్వర్యముతో తులతూగుతున్నవారి వారి గృహములలోని ఐశ్వర్యమంతా దహించెను. ఆ వీరుడు అన్ని భనములను దాటి రాక్షసేంద్రుడు అగు రావణుని భవనము చేరెను.

అక్కడ హనుమంతుడు నానారత్న విభూషణములతో విరాజిల్లుచున్న, మేరు మందర పర్వతములవలెనున్న, అన్నిరకములుగా మంగళప్రదముగానున్న ముఖ్యగృహములో తన లాంగూలాగ్రములో ప్రజ్వరిల్లు చున్న అగ్నితో నిప్పంటించి కాలమేఘములవలె గర్జించెను.

వాయువు కలవడముతో అగ్ని అతి వేగముగా బలవత్తరముగా పెరిగెను. ఆ అగ్ని కాలాగ్ని వలె జ్వలించెను. పవనునిచేత ప్రజ్వలింపబడిన అగ్ని ఆ భవనములన్నిటిలో తిరిగెను. ఆ వాయువు సంగమము తో అగ్ని అతి వేగముగా ప్రజ్వరిల్లెను. బంగారు జాలలు మణిరత్న భూషితమైన మహత్తరమైన భవనములు ఆ అగ్నిజ్వాలలో కాలి పడిపోయినవి.

తమ గృహములను రక్షించుకొనుటకు పరిగెడుచున్నరాక్షసులు సంపాదించిన సంపదలను రక్షించుకో లేక భగ్నోత్సాహము కలవారై 'తప్పక అగ్నియే కపిరూపములో వచ్చినది' అని అనుకొనిరి. అప్పుడు హాహాకారముల శబ్దములు చెలరేగినవి. కొందరు పసిబిడ్డలకి పాలు ఇచ్చుచున్న స్త్రీలు వారి జుట్టు విడిపోయి హాహాకారము చేస్తూ అగ్నితో చుట్టబడిన భవనములనుండి తోందరలో దూకిరి. అప్పుడు వారు అంబరమునుండి పడుతున్న సౌదామినులవలె నుండిరి.

ఆ హనుమంతుడు ఆ అగ్నిజ్వాలలకి దగ్ధమౌతున్న భవనముల నుండి వజ్రములు పగడములు వైడూర్యములు బంగారము వెండి ధాతువులతో కూడిన ద్రవ్యముల ధారలను చూచెను. ఏవిధముగా అగ్ని కట్టెలు తృణములతో తృప్తిచెందదో, అదే విధముగా హనుమంతుడు రాక్షసేంద్రుని రాక్షసులను హతమార్చినా తృప్తి చెందలేదు.

ఆ అగ్నిశిఖలు కొన్ని కింశుకాపుష్పముల వెలుగుతూ, కొన్ని శాల్మలీపుష్పముల వెలుగుతూ, కొన్ని కుంకుమ పుష్పముల వెలుగుతూ ప్రకాశించుచున్నవి. మహాత్ముడైన హనుమంతుని చేత ఆ లంకాపురము, రుద్రుడు త్రిపురమును దగ్ధమొనరించినట్లు, దగ్ధము చేయబడెను.

అ భీమపరాక్రమము గల హనుమంతుని చేత వేగముగా ప్రజ్వలింపబడిన అగ్ని, వలయాకారముగా పెరుగుతూ శిఖరాగ్రమున ఉన్న ఆ లంకానగరము పైకి లేచెను. ధూమములేని ఆ భవనములలో వున్న అగ్ని వాయువుచేత ప్రకోపింపబడి రాక్షస శరీరములను దగ్ధము చేయుచూ మరింత పెరిగినవి. సమస్త లంకానగరమును చుట్టిన ఆ తేజోవంతమైన ఆ అగ్ని కోటి సూర్యుల సమానముగా కనపడెను. ఆ అగ్ని వజ్రాయుధము తో కొట్టబడి బ్రహ్మాండమంతా విరుగుచున్నట్లు చేసిన శబ్దములు వలె కల శబ్దములతో ప్రభవించెను.

ఆ అగ్ని కింశుకాపుష్పపు వర్ణముతో వెలుగుచూ మిరిమిట్లు కొలిపే కాంతులతో ఆకాశమంతా వ్యాపించెను. సమస్తము దగ్ధముచేసి మంటలు చల్లారిన పిమ్మట లేచిన పొగలతో చుట్టబడిన మేఘములు నలువ కలువలవలే ప్రకాశించెను. ధగ్ధమగుతున్న నగరముచూచి రాక్షసులు ఈ విధముగా తలచిరి. 'ఇతడు వానరుడుకాడు. ఇతడు వజ్రాయుధధారి దేవతల ప్రభువు అయిన ఇంద్రుడుకావచ్చు. లేకసాక్షాత్తు యముడో వరుణుడో రుద్రుడో కుబేరుడో సూర్యుడో చంద్రుడో అవవచ్చు. లేక స్వయముగా కాలపురుషుడో అవవచ్చు. లేక సమస్త సృష్టికర్త చతురాననుడైన బ్రహ్మయే ఈ వానరరూపములో రాక్షససంహారమునకు వచ్చెనా ? అనంతము అవ్యక్తము ఊహకందని ఒకే మహావిష్ణువు అతి తేజోమయుడు రాక్షసులను పూర్తిగా అంతము చేయుటకు వానరూపములో వచ్చెనా?' అని.

ఆ రాక్షసగణములందరూ, ఆ నగరము సమస్త ప్రాణి సంఘములతో, అలాగే గృహములూ వృక్షములతో సహాదగ్ధము అయిపోతూవుంటే, ఈ విధముగా కలిసి ఒకరొకొకరు ఈ విధముగా చెప్పుకొనసాగిరి.

అప్పుడు రాక్షసులు అశ్వములు రథములు నాగులు మృగములతో పక్షిసంఘముల తో సహా దగ్ధము అవుతున్న ఆ లంకా నగరము నుండి రోదన ధ్వనులు పైకి లేచాయి. ' ఓ తాత, ఓ పుత్రా, ఓ మిత్రుడా భోగించతగిన పుణ్యమైన జీవితము నాశనమైనది', అంటూ రాక్షసులందరి ద్వారా ఘోరమైన నాదము ఆకాశములోకి లేచెను.

హనుమంతుని క్రోధ బలములచే అగ్ని జ్వాలలతో చుట్టబడి, హతులైన యోధులతో, పారిపోతున్న సైనికులతో నిండిన లంకా నగరము శపింపబడినదా అన్నట్లు ఉండెను. మహాత్ముడైన ఆ హనుమంతుడు విషణ్ణులైన రాక్షసులతో నిండిన, అగ్నిజ్వాలలతో చుట్టబడి దగ్ధమౌతున్న, స్వయముగా బ్రహ్మ యొక్క ఆగ్రహమునకు గురి అయినదా అన్నట్లు వున్న, లంకానగరమును సంభ్రమముతో చూసెను.

అత్యంత ఉత్తమమైన వృక్షములతో కూడిన వనములను దహించి, రాక్షసులను హతమార్చి, రత్నమాలికలవలె కూర్చబడిన గృహములతో కూడిన లంకను దహించి, ఆ పవనాత్మజుడైన ఆ హనుమంతుడు అచట నిలబడెను.

వానరులలో సింహము లాంటి హనుమంతుడు, ప్రజ్వలిస్తున్న లాంగూలముతో అ విచిత్రమైన త్రికూట శిఖరముపై నిలబడి, కిరణములమాలతో ప్రకాశించుచున్న సూర్యునివలె నుండెను.

మహాత్ము డైన ఆ హనుమంతుడు అనేక రాక్షసులను వృక్షములతో కూడిన వనములను భగ్నముచేసి రాక్షస భవనములకు నిప్పు అంటించి మనస్సులో రాముని తలచుకొనెను. అప్పుడు ఆ వానరవీరులలో ముఖ్యుడైన మారుతితో సమానమైన వేగము కల మహాబలవంతుడైన గొప్పబుద్ధిశాలి అయిన సర్వశ్రేష్టుడు అయిన హనుమంతుని దేవగణములందరూ ప్రశంసించిరి.

అ మహాతేజోమయుడైన మాహాకపి వనములను ధ్వంసము చేసి యుద్ధములో రాక్షసులను హతమార్చి రమ్యమైన లంకానగరము దగ్ధము చేసి రాజించెను. అప్పుడు గంధర్వులతో కూడిన దేవతలూ సిద్ధులు మహాఋషులూ ఆ దగ్ధ్మైన లంకను చూస్తూ అత్యంత విస్మయము పొందిరి.

ఆ మహాకపి వానరలలో శ్రేష్టుడు అయిన హనుమంతుని చూచి సమస్తభూతములూ అతడు కాలాగ్నియే అని భావించి భయభ్రాంతులైరి.

అప్పుడు ముని పుంగవులు గంధర్వులు, విద్యాధరులు నాగులు యక్షులు సమస్త భూతములు అత్యంతమైన ఆనందమును పొందిరి.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఏబది నాలుగవ సర్గ సమాప్తము
||ఓమ్ తత్ సత్||
దేవాశ్చ సర్వేమునిపుంగవాశ్చ గంధర్వవిద్యాధరనాగయక్షాః|
భూతాని సర్వాణి మహాన్తి తత్ర జగ్ముః పరాం ప్రీతిమతుల్యరూపామ్||51||
స||తత్ర సర్వే మునిపుంగవాశ్చ గంధర్వవిద్యాధరనాగయక్షాః మహంతి సర్వాణి భూతాని అతుల్యరూపాం పరాం ప్రీతిం జగ్ముః||
తా|| అప్పుడు ముని పుంగవులు గంధర్వులు, విద్యాధరులు నాగులు యక్షులు సమస్త భూతములు అత్యంతమైన ఆనందమును పొందిరి.
||ఓమ్ తత్ సత్||